కడప పార్లమెంటరీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్టు ఆ వర్గం అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. హైదరాబాద్లోని సాగర్ సొసైటీలో ఉన్న జగన్ నివాసం వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పార్టీ త్వరలోనే వస్తుందన్నారు. దీనిపై జగనే స్వయంగా ప్రకటన చేస్తారని చెప్పారు. అయితే, పార్టీ ఏర్పాటుకు రోజులు.. నెలలు పడుతుందా అనే విషయాన్ని తాను ఇపుడే చెప్పలేమన్నారు.వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా జగన్ పార్టీ కృషి చేస్తోందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ పార్టీకి వైఎస్ అభిమానాలు, కాంగ్రెస్ వ్యతిరేకులు తమ మద్దతు తెలుపుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు.జగన్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలీయమైన పార్టీగా అవతరించబోతుందని అంబటి జోస్యం చెప్పారు. తమకు ప్రజలే మార్గ నిర్దేశకులన్నారు. అందువల్ల ప్రజల ఆశీస్సులు జగన్కు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇకపోతే.. మంత్రుల రాజీనామాలు, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం కూలిపోతుందా, ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే అంశాలతో తమకు సంబంధం లేని అంశమన్నారు. ఈ పరిణామాలతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. అదేసమయంలో వైఎస్ శ్రమతో ఏర్పాటైన ఈ కాంగ్రెస్ సర్కారును కూల్చే దుర్బిద్ది జగన్కు లేదన్నారు.ఇకపోతే పార్టీ ఏర్పాటు అంశంపై జగన్ తన అనుచరులు, జిల్లా స్థాయిలో ఉన్న నేతలు, అభిమానులతో చర్చలు జరుపుతున్నారన్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో నెలకొన్న అంశాలపై కూలంకుషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వీటిపై చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి